దుబాయ్లో స్థిరపడిన నగరి ప్రవాసాంధ్రులకు APNRT కీలక బాధ్యతలు
నగరి, ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల కోసం ఇటీవల ప్రకటించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంట్రీ కోఆర్డినేటర్ల జాబితాలో నగరి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ప్రవాసాంధ్రులు చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా కోఆర్డినేటర్లను నియమించిన APNRT కార్యక్రమంలో వీరికి కీలక బాధ్యతలు అప్పగించడం విశేషంగా నిలిచింది.
నగరి ప్రాంతానికి చెందిన కాసాల లోకేష్, బొజ్జాల గిరి, బొజ్జాల గోపి గత పదేళ్లుగా దుబాయ్లో స్థిరపడి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు. ప్రవాస తెలుగువారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో APNRTతో సమన్వయం చేయడం, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం వంటి కీలక బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు.
ఈ సందర్భంగా నగరి ప్రాంత ప్రజలు, ప్రవాసాంధ్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) వ్యవస్థాపకులు మల్లేశన్, వివిధ ప్రాంతాల అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, సర్వాణి విద్యాధరణి, పళ్లెం తేజ, పామిరెడ్డి రామిరెడ్డి తదితరులు ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రవాసాంధ్రులకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.